ఏజన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనులకు అనేక సందర్భములలో రక్తం అందక మరణిస్తూ వున్నారు. గిరిజన ప్రాంతంలలో ప్రజలకి సరైన వైద్యం కూడా అందక వారు ఇబ్బంది పడుతున్న పరిస్తితి వున్నది. ప్రధానంగా ప్రసవాలు, ఏదేని ప్రమాదాలు జరిగిన సందర్భంలో, సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తం ఎక్కించాలంటే రక్త నిధి నిల్వ కేంద్రాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ఈ ప్రాంతంలో బ్లడ్ బాంక్ లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వున్నది. ఎట్టకేలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 చోట్ల బ్లడ్ బాంక్ లు ఏర్పాటు చేస్తూ వుత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగు ప్రాంతాల్లో రక్త నిధి స్టోరేజీ యూనిట్లు, పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. పాల్వంచ, మణుగూరు, ఇల్లందు, అశ్వారావుపేటలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రక్త నిల్వలు కూడా అధికంగా వుండేలా చర్యలు తీసుకుంటుంటామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి, గర్భిణిలకు ఈ స్టోరేజి యూనిట్లు సంజీవనిలా పని చేస్తాయని పేర్కొన్నారు.
గతంలో రక్తం ఎక్కించాలంటే కొత్తగూడెం, భద్రాచలం ఆసుపత్రిలలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండేవని, వీటి ఏర్పాటుతో స్థానికంగా రక్తం ఎక్కించుకోవడానికి ప్రజలకు సులువు అవుతుందని చెప్పారు. రక్త నిధి కేంద్రాలు ఏర్పాటు ద్వారా ప్రజలకు దూరా భారం తగ్గడంతో పాటు ఆపత్కాలంలో ఉన్నవాళ్లకు తక్షణమే రక్తం అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇల్లందు, మణుగూరు, అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రులలో ఇప్పటికే ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి సర్జరీలు ప్రారంభించినట్లు వివరించారు.
ఆపరేషన్ సమయంలోను, యాక్సిడెంట్ కేసుల్లో అత్యవసర సమయాల్లో స్థానికంగానే ఈ స్టోరేజి కేంద్రాల్లో అన్ని రోజుల్లో రక్తం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి రక్తం కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఈ సెంటర్ల ఏర్పాటుతో తొలగిపోనున్నాయని పేర్కొన్నారు. 20 లక్షలతో రక్తనిధి కేంద్రం నుంచి రక్తనిల్వ కేంద్రానికి తరలించడానికి ప్రత్యేక వాహనాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు.