భారత్ జోడో యాత్ర లో తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేయి పట్టుకున్నారని నటి పూనం కౌర్ చెప్పారు. రాహుల్ తన చేయి పట్టుకోవడాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పక్క నారీశక్తి అని మాట్లాడుతుంటే బీజేపీ నేతలు ఇలా చేయడం తగదని, ఇది అవమానకరమని పూనమ్ కౌర్ చెప్పారు. పూనమ్ కౌర్ చేనేత కార్మికుల అంశం మాట్లాడటానికి మహబూబ్ నగర్లో రాహుల్ గాంధీని కలిసినట్లు పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీ లేకుండా చేస్తామని ఆమెకు రాహుల్ హామీ ఇచినట్లు చెప్పారు. దీన్ని పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళలపై రాహుల్ గాంధీకున్న గౌరవభావాలు తన హృదయాన్ని స్పృశించాయని ట్వీట్ చేశారు. అంతేకాదు చేనేత కార్మికుల తరపున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు కూడా తెలిపారు.
ఇదిలా వుండగా రాహుల్ గాంధీ పూనమ్ చేయి పట్టుకున్న ఫొటోను బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ ట్వీట్ చేశారు. తాత అడుగుజాడల్లో రాహుల్ నడుస్తున్నాడని ప్రీతి గాంధీ కామెంట్ పెట్టారు. అంతే దీనిపై రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో రాహుల్, పూనం కౌర్ ఫొటోపై ఫైట్ తీవ్రమైంది. ప్రీతి గాంధీ ట్వీట్పై కాంగ్రెస్ కార్యకర్తలు స్పందించారు. నరేంద్ర మోదీ మహిళలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రీతి గాంధీ క్షమాపణలు చెప్పి తన ట్వీట్ను డిలీట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు సూచిస్తున్నారు. వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.