చండీగఢ్ లోని సెక్టర్ 32 లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మరణించారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో పేయింగ్ గెస్టు హాస్టల్ నడుస్తున్నది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పట్టించుకోలేదు.
ఈ చిన్న భవనంలో 36 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మిగిలిన వారంతా బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నది. ముగ్గరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలకు లోనయ్యారు. ప్రమాదం సంభవించిన 10 నిమిషాలలో అగ్ని మాపక దళం వచ్చినా అప్పటికే భవనం మొత్తం కాలిపోయిందని అగ్నిమాపక దళం అధికారి తెలిపారు.
అగ్ని ప్రమాదానికి కారణాలు కచ్చితంగా తెలియలేదు కానీ అక్కడ ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి ఒక విద్యార్ధిని లాప్ టాప్ చార్జింగ్ పెట్టుకోవడానికి ప్లగ్ వినియోగించడం తో అక్కడ నుంచి స్పార్క్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మరణించిన ముగ్గురిని ముస్కాన్, రియా, పక్సీ గా గుర్తించారు. ఎడ్యుకేషన్ హబ్ గా మారిన చండీగఢ్ కు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చి చదువుకుంటుంటారు. పిజి ఎకామ్ డేషన్లు, హాస్టళ్లు ఎక్కువగా ఉండే చండీగఢ్ లో ఇలాంటి అనుమతి లేని భవనాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలో ఎంతో మంది యువతీ యువకులు ఉంటున్నారు.