రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతల వల్ల జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ముగ్గురు పసిపిల్లలు మరణించడం చాలా బాధాకరమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మరణాలకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంకో 30 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారన్న వార్తలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. కరెంటు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యపు విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ఈ మరణాలు వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే బిజెపి భావిస్తోందని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల విధించిన కరెంటు కోతల కారణంగా చనిపోయిన పిల్లల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మిగిలిన పిల్లలకు ఎలాంటి అపాయం కలగకుండా, రాష్ట్రంలో ఇలాంటి మరో సంఘటన జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.