ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చిన హీరోల సినిమాలకే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన దర్శకుడు రాజమౌళి చిత్రం త్రిబుల్ ఆర్ కు, చిరంజీవి సినిమా ఆచార్యకు, ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ కు టిక్కెట్ ధరల పెంపునకు ఏపి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసింది.
ఇప్పుడు హీరో మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’ సినిమా టికెట్ల రేటు పెంపునకు కూడా ఏపీ సర్కారు అనుమతినిచ్చింది. అప్పటిలో జగన్ ను కలిసిన హీరోల్లో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సినిమాల విడుదలకు ముందు సదరు సినిమా నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి తమ బడ్జెట్ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అభ్యర్థిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్రభుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపునకు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ఏపీ సర్కారు… సర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి మంజూరు చేసింది.