రాజధాని అమరావతిని రక్షించుకోవడానికి రైతులు చేస్తున్న దీక్షలు 200 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మోగా దీక్ష చేపడుతున్నట్లు సమితి ఛైర్మెన్ ఎ.శివారెడ్డి తెలిపారు. గురువారం ఆటోనగర్ లోని అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని తరలించవద్దని రాజధాని రైతులే కాక రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల రోజులు గా దీక్షలు చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోనపోవడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల నగరాల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాజధాని తరలింపు తట్టుకోలేక తనువు చాలించిన వారికి నివాళులు అర్పించి మోగా దీక్ష ప్రారంభిస్తామని తెలిపారు. రాజధాని తరలింపు చర్యను వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.
వైకాపా తప్ప అన్ని పార్టీలూ మద్దతునిస్తున్నాయి
వైకాపాలో కొంత మంది ప్రజాస్వామ్యవాదులు కుడ రాజధాని తరలింపు చర్యలను వ్యతిరేకిస్తున్నరని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారని తరువాత సచివాలయం, హైకోర్టుల భవనాలను తరలిస్తున్నమని అమ్మకానికి పెడతారని ఆయన అన్నారు.
ప్రభుత్వ చర్యలను కోర్టులు కూడ తప్పు పడుతున్నాయని ఆయన అన్నారు. నవరాత్రులు ఉపవాస దీక్షలు చేసి శంకుస్థాపన చేసిన రాజధానిని తరలించి మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. గత రెండు వందల రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం దీక్షలో అందరు పాల్గోని విజయవంతం చేయవలసినదిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జె.ఎ.సి. కన్వీనర్లు గద్దే తిరపతి రావు, ఆర్ వి.స్వామి, సుధాకర్, అమరావతి పరిరక్షణ సమితి మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ, రఫీ, ఎ.యమ్.రావు తదితరులు పాల్గొన్నారు.