జర్నలిస్టుల హక్కులు,సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఈనెల 27న హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తెలిపారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగే ఫెడరేషన్ రాష్ట్ర మహాసభల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎడిటర్లు పాల్గొంటారని వారు తెలిపారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి జర్నలిస్టుల మహా ప్రదర్శన జరుగుతుందని పేర్కొన్నారు.
మహా ప్రదర్శన సందర్భంగా వివిధ కళా బృందాల ప్రదర్శనలు కూడా ఉంటాయని, మహాసభలకు అన్ని జిల్లాల నుంచి దాదాపు రెండు వేల మంది జర్నలిస్టులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లు ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే) ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు.