ఆడపిల్లలను కాపాడాలని, వారి హక్కులను పరిరక్షించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాలల హక్కుల ప్రజా వేదిక రూపొందించిన బాలికా దినోత్సవ పోస్టర్ ను ఆమె విడుదల చేశారు.
స్త్రీలను దేవతలుగా పూజించే మన సమాజంలో వారి రక్షణ కోసం అందరూ పాటుపడాలని కోరారు. ముఖ్యంగా సిఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, సంరక్షణకు, భద్రతకు పెద్ద పీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, బాల్యవివాహాలను నివారించేందుకు కళ్యాణ లక్ష్మీ పథకం సమర్ధవంతంగా పనిచేస్తోందని, గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం అంగన్ వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా పౌష్టికాహారాన్ని ఇస్తున్నామని మంత్రి అన్నారు.
అదేవిధంగా గర్భం దాల్చిన ఆరుల నెలల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు 6 నెలల పాటు నెలకు 2000 చొప్పున 12,000 రూపాయలు ఇస్తున్నారని, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి 13000 ఇస్తూ, ఆడపిల్లల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని చెబుతున్నారన్నారు. సమాజంలో కూడా పౌరులందరూ ఆడపిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని, లింగ వివక్షతను రూపుమాపాలని, బాలికల విద్యకు, వికాసానికి తోడ్పడాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో మహిళలు ముందుండి రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఫారూఖ్ హుస్సేన్, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు వలుస సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీడిశెట్టి రాజు, రాష్ట్ర దళిత బహు జన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి టి శంకర్, జె .ఏ.సీ మహిళా చైర్మన్ యం. జయంతి పాల్గొన్నారు. ఇంకా వికలాంగుల మహిళా సాధికార సంఘం అధ్యక్షులు కోలా రాజ్యలక్ష్మి దళిత బహు జన ఫ్రంట్ మహిళా కన్వీనర్ సంగీతా లల హక్కుల ప్రజావేదిక హైదరాబాద్ నగర కన్వీనర్ పొన్నాల బాబు, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర నాయకురాలు కె.వరలక్ష్మి నాయకులు పి. లక్ష్మయ్య సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం మాధవి పి. మాధవి తదితరులు కూడా పాల్గొన్నారు.