మాజీ కేంద్రమంత్రి యస్. జైపాల్ రెడ్డి 82 జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ లో జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంతో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు. ఆనాడు ఎంపీలుగా ఉన్న వారందరినీ ఒక్కదారిలో నడిపి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మహా నగరం రాజధానిగా నేడు ఉందని అంటే అది జైపాల్ రెడ్డి గారి శ్రమనే అన్నారు. హైదరాబాద్ కి మెట్రో రైల్ ప్రాజెక్టు రావడానికి ప్రధాన కారణం స్వర్గీయ నేత జైపాల్ గారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, గుత్తా అమిత్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.