రంగుల ప్రపంచం సినిమాలో హీరోనే కాదు….నిజ జీవితంలో రీల్ హీరో అసలే కాదు….రియల్ హీరో అనిపించుకొని, కేవలం కన్నడ ప్రజల మనసునే కాదు, యావత్ భారతావని మెచ్చిన అసలు సిసలైన హీరో, సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు సామాజిక కార్యకర్త, నేనుసైతం వ్యవస్థాపక అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నేనుసైతం కార్యాలయంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ పునీత్ సామాజిక సేవే పరమావధిగా భావించి, అనాదలను, వయో వృద్ధులకు అండగా నిలిచారన్నారు.
అంతేకాకుండా చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని అలవరుచుకున్న పునీత్ 20 పైగా అనాధ ఆశ్రమాలు, వృద్ధ ఆశ్రమాలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. తండ్రి రాజ్ కుమార్ పేరుతో ఎన్నో మంచి కార్యక్రమంలో చేపట్టారు. చదువుకోవాలని తపన ఉండి ఫీజులు కట్టేందుకు ఆర్థిక స్తోమత లేని దాదాపు 1800 వందల మంది విద్యార్థినీ, విద్యార్థులకు తాను సొంతంగా డబ్బులు కట్టి వారికి ఉన్నత విద్యను అందిస్తున్నారని ఆయన తెలిపారు.
పునీత్ సేవలు చిరస్మరణీయం
అంతేకాకుండా గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి జరుగుతుంది భావించి 32 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కృషి చేశారన్నారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారని ఆయన తెలిపారు. గతంలో వరదలు విలయతాండవం చేసిన నేపథ్యంలో రూ. 5 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధికి పునీత్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల కరోనా కష్టకాలంలో పాఠశాల విద్యార్థుల కోసం పునీత్ కొత్తగా లెర్నింగ్ యాప్ ప్రవేశ పెట్టారని ఆయన తెలిపారు. నిరుపేద విద్యార్థుల కోసం 45 పాఠశాలలను ప్రారంభించి, వారికి మెరుగైన విద్య సదుపాయాలు కల్పించారని ఆయన తెలిపారు. వీటితో పాటు గోవుల పరిరక్షణ కోసం ఆయన 18 గోశాలలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తన సంపాదనలో 70 శాతం డబ్బులను సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ యావత్ భారత దేశానికి పునీత్ ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ప్రవీణ్ ఆయన సేవలను కొనియాడారు.
సేవా కార్యక్రమాలే పరమావధిగా పనిచేసే పునీత్ లాంటి రియల్ హీరోను కోల్పోవడం కన్నడ ప్రజలకే కాకుండా దేశానికే తీరని లోటన్నారు. ఈ సందర్భంగా పునీత్ కుటుంబ సభ్యులకు నేనుసైతం ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేనుసైతం ప్రతినిధులు విష్ణువర్ధన్, మైమూదు, వెంకట్ రామ్ రెడ్డి, నవీన్, సయ్యద్ సమీర్, పాషా, ఫర్డిన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.