మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక దాసన్నపేట రింగురోడ్డులోని అల్లూరి విగ్రహం వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, మేయర్ వి.విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, జిల్లా అధికారులు, అల్లూరి సేవా సమితి ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
తొలుత అల్లూరి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే కోలగట్ల, జిల్లా కలెక్టర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.