ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో జరిగిన ఈ పరిణామం రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేరిక శుభపరిణామమని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిజాయితీకి మారుపేరు మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అని ఈ సందర్భంగా కోమటిరెడ్డి అన్నారు. TRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం అయిందని ఆయన తెలిపారు. రేపు ఈ మేరకు అధికారికంగా ప్రకటన రాబోతున్నట్లు ఆయన చెప్పారు.
నాలుగు కోట్ల మంది ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదని ఆయన అన్నారు. దుబ్బాక లో టిఆర్ యస్ నైతికంగా ఓడిపోయిందని ఆయన అన్నారు.