మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆ పార్టీల కారణంగానే మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని మంత్రి అజయ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా కొరటికల్, దుబ్బకాల్వ గ్రామాల్లో మంత్రి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రి సారథ్యంలో తెరాస పార్టీలో చేరారు. ఇంటింటికీ ప్రచారంలో భాగంగా తమ ఇళ్ళకి విచ్చేసిన మంత్రికి స్థానిక మహిళలు నుదుటిన కుంకుమ దిద్ది హారతి పట్టి ఘన స్వాగతం పలికారు. నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఒక అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అని అన్నారు.
నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే అధికార పార్టీని గెలిపిస్తాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వలనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ఆరు నెలల్లో మళ్ళీ ఎన్నికలు తప్పవన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ రాజగోపాల్ రెడ్డిని వాడుకొంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు.