కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన తాను చిరువ్యాపారం మొదలు పెడితే కార్పొరేటర్ భర్త తనను వేధిస్తున్నాడని హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ కు చెందిన ఒక టీఆర్ఎస్ కార్యకర్త వాపోతున్నాడు. ఈ మేరకు ఆయన మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ కార్యకర్త అయిన అన్నపూర్ణ నగర్ కు చెందిన కే. శ్రీనివాస్ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దాంతో జీవనోపాధి సాగించేందుకు కొంత సొమ్ము అప్పుగా తెచ్చుకుని వడ్డెర బస్తి పక్కనే ఉన్న చెత్త కుండీ దగ్గర ఇటుకలు, ఇసుక వ్యాపారం మొదలు పెట్టాడు.
టీఆర్ఎస్ కార్యకర్త సొంతగా ఎదగడం ఇష్టం లేని టీఆర్ఎస్ నాయకులు అతని వ్యాపారంపై కన్నేసి ఆయనను వేధిస్తున్నారు. ఇదే విషయాన్ని శ్రీనివాస్ స్థానిక విలేకరులకు తెలిపారు.
గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ భర్త తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని, తనపై జులుం చేస్తున్నాడని శ్రీనివాస్ ఆరోపించాడు. శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో ఉద్యోగం కోల్పోయిన తనను ఆదోకోవాల్సింది పోయి బాధ్యతగల టీఆర్ఎస్ నాయకుడు అలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు.
స్థానిక కార్పొరేటర్ భర్త అయిన శ్రీనివాస్ గౌడ్ జిహెచ్ఎంసి ఎన్ పోర్సు మెంట్ వారికి తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. అందుకుగాను వాళ్లు తనకు జరిమానా విధించారని ఆయన అన్నారు.
చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునే తనను ఇలా వేధించడం తగదని ఆయన ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ కు ఫిర్యాదు చేశారు.