చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తుడుం దెబ్బ మండల కమిటీ, ఆదివాసీ తొమ్మిది తెగల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు.
ఆదివాసీ భవన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సంప్రదాయ ర్యాలీ నిర్వహించిన ఆదివాసీలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ పవన్ చంద్ర కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. లంబాడలకు ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్లు తహసీల్దార్ లు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.
జీవో నం.3 ని యధావిధిగా కొనసాగించాలని, నాన్ ఏజెన్సీ గ్రామాలుగా ఉన్న ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటించాలన్నారు. పేసా 1/70 చట్టంను పకడ్బందీగా అమలు చేయాలని, ఆదివాసీ బందు పేరిట ప్రతీ ఆదివాసీ కీ రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి లేని ఆదివాసులందరికి 3 ఎకరాల సాగు భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
సిజనల్ వ్యాధులను అరికట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన ఆదివాసీలకు ఇంటి స్థలాలు , డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపూరావు, నాయకులు ఉయక సుదర్శన్, మరప భరత్, భగవంత్ రావు, పెందూర్ మారుతీ, మెస్రం నాగ్ నాథ్, మార్సుకోల నగేష్, జూగ్నక్ భరత్, పుర్క చిత్రు, పెందూర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.