రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు.
“తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు” నినాదంతో ఆవిర్భవించిన tuwj రాష్ట్ర కమిటీ సగర్వంగా రూపొందించిన జర్నలిస్టు డైరీని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
మలిదశ ఉద్యమాన్ని పత్రికలు, మీడియా ముందుండి నడిపించాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ములుగు పాత్రికేయులు 147కిలోమీటర్ల పాదయాత్ర చేసి జిల్లాను సాధించడం ద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు.
జిల్లా జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని 18వేలకు పైగా అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేసిందన్నారు.
ములుగు జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంతోపాటు జిల్లా ప్రెస్ క్లబ్ భవనానికి సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో Tuwj నాయకులు కొట్టే రాజిరెడ్డి, చుంచు రవి తదితరులు పాల్గొన్నారు.