ములుగు జిల్లా ఏటూరునాగారం కు త్వరలోనే ఆర్టీసీ డిపో మంజూరు చేయనున్నట్లు, అలాగే, గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, పారిశుద్ధ్య నిర్వహణ కోసం తగినన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
అయితే, గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటూరునాగారంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి, గ్రామ పంచాయతి ని ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను స్వయంగా చూశారు. పంచాయతీ అధికారులు, సర్పంచ్, వార్డు సభ్యులను పిలిచి వారితో చర్చించారు.
ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఎందుకు ఉందని నిలదీశారు. అద్దంలా రోడ్లు మెరవాలని, గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. గ్రామ కార్యదర్శి సహా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిపిఓ తో మాట్లాడి ఆదేశించారు. గ్రామ కార్యదర్శి పనితీరు, పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవారం రోజుల్లోగా గ్రామంలో పరిశుభ్రతను పెంచాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకవైపు రాష్ట్రంలోని గ్రామాలు దేశంలోనే ఉత్తమంగా అవార్డులు దక్కించుకుంటుంటే… ఏటూరునాగారం గ్రామంలో ఇందుకు భిన్నంగా ఉండటం సరికాదని చెప్పారు.
మరికొద్ది రోజుల్లో పరిస్థితులు మెరుగు పడాలని మంత్రి ఆదేశించారు. కాగా సీఎం కెసిఆర్ గారి చొరవ వల్ల ములుగు జిల్లా అయిందని, అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని చెప్పారు. వరదల సమయంలో సీఎం కెసిఆర్ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఆదేశించారు. సీఎం గారి ఆదేశానుసారం ములుగు జిల్లా తో పాటు, ఏటూరు నాగారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రితో పాటు ములుగు zp చైర్మన్ కుసుమ జగదీష్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు ఉన్నారు.