ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి అధికారంలో ఉన్న పెద్దల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపిస్తున్న నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి దారుణమైన ట్వీట్లు పెడుతున్నారు.
అత్యంత నీచమైన భాష వాడుతున్న విజయసాయిరెడ్డి ట్వీట్లను సంస్కారం ఉన్న వారంతా అసహ్యించుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పదే పదే పాల్పడుతున్న విజయసాయిరెడ్డికి అదే స్థాయిలో రఘురామకృష్ణంరాజు బదులు ఇవ్వలేకపోతున్నారు.
సంస్కారాన్ని చంపుకుని తాను విజయసాయి రెడ్డికి సమాధానం చెప్పలేనని ఆయన అంటున్నారు. ప్రధాని తన నియోజకవర్గానికి వస్తున్నందున రఘురామకృష్ణంరాజు కూడా వెళ్లాల్సి ఉంది. గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గానికి దూరం అయ్యారు.
అధికారంలో ఉన్న వారు తాను ఆంధ్రప్రదేశ్ వస్తే ఎక్కడ కేసులు పెడతారో అనే ఆందోళనలో ఆయన ఢిల్లీకే పరిమితం అయ్యారు. ఒక సారి ఆయనను ఏపిసిఐడి పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేసిన విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.
ఆ తర్వాత పలు మార్లు ఆయనపై ఎస్సి, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టించారు. దాంతో ఆయన నియోజక వర్గానికి రావడం లేదు. పోలీసులు తనను మళ్లీ అరెస్టు చేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో భీమవరంలో ఆయన ఇంటికి వెళ్లే రోడ్డును స్థానిక అధికారులు తవ్వేశారు. దీనిపై కూడా రఘురామకృష్ణంరాజు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు ప్రతి రోజూ ప్రభుత్వ పాలసీలను విమర్శిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు ఆయనను ఎలా కార్నర్ చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు.
ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ పరువు పూర్తిగా పోతున్నది. రఘురామకృష్ణంరాజు అన్నింటికి తెగించి జగన్ తో పోరాటం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో ఆయన జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ధజమెత్తుతున్నారు.
జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి విజయసాయి రెడ్డి లాంటి వారు ఎంతో శ్రమ పడాల్సి వస్తున్నది. రఘురామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో చేస్తున్న డ్యామేజీని కంట్రోల్ చేసుకోలేని విజయసాయి రెడ్డి తన కసినంతా ట్విట్ల రూపంలో తీర్చుకుంటున్నారు.
ఇలా పచ్చి బూతులతో ట్విట్లు పెట్టడాన్ని ఎవరు హర్షిస్తున్నారో తెలియదు కానీ విజయసాయి రెడ్డి మాత్రం బూతుల ట్వీట్లు ఆపడంలేదు. విజయసాయి బూతులతో ట్వీట్లు పెట్టినప్పుడల్లా మరింత రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త కుంభకోణాలను రఘురామకృష్ణంరాజు బయటకు తీసుకువస్తున్నారు. అలా కొత్త విషయాలు బయటకు వచ్చినప్పుడల్లా జగన్ ప్రతిష్ట దిగజారి పోతూనే ఉన్నది.
జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీతో తన నియోజకవర్గానికి రాబోతున్న రఘురామకృష్ణంరాజును ఎలాగైనా అరెస్టు చేయాలని ప్రభుత్వంలో ఉన్న కొందరు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాల నుంచి ముందుగానే ఉపశమనం పొందారు.
ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ప్రత్యర్థులపై కక్ష సాధించే జగన్ ప్రభుత్వం రఘురామకృష్ణంరాజును ఈ సారి ఏమైనా చేస్తే జాతీయ స్థాయిలో మరింతగా పరువు పోవడం ఖాయం.