రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాల పరిమితిలోనే రెండోసారి డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు భారం మోపుతూ ఆర్టీసి బస్ ఛార్జీలను పెంచడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. ప్రజల నిరసనల ఫలితంగా డీజిల్ రేట్లు రూ.10లు తగ్గిన తరుణంలో డీజిల్ సెస్ పేరుతో భారం మోపడం శోచనీయమని అన్నారు. 30 కిలోమీటర్ల పైన ప్రయాణించే ప్రయాణీకులందరిపైనా రూ.10/- నుండి రూ.100/-ల వరకు టికెట్టుకు ధర పెంచడం దారుణమని అన్నారు.
మరోవైపు విద్యార్థులు బస్ పాసుల రేట్లను ప్రభుత్వం పెంచడం అన్యాయమని, ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇతర ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని ఈ సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి బస్ ఛార్జీలు పెంచడం గోరుచుట్టుపై రోకటి పోటు అవుతుందని విమర్శించారు. పెంచిన బస్ ఛార్జీల నిర్ణయాన్ని తక్షణం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో
సిపిఎం జిల్లా నాయకులు జి.సింహాచలం,టి.తిరుపతిరావు, కె.నాగమణి,పి.తేజేశ్వరరావు,కె.శ్రీనివాస్, అల్లు.మహాలక్ష్మి, పి.ప్రసాదరావు, డి.రమణారావు తదితరులు పాల్గొన్నారు.