ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది క్రమేపీ బలపడి 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి ఆంధ్రప్రదేశ్ దిశగా పయనించనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అది తుపానుగా, పెను తుపానుగా మారే అవకాశం వున్నదని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ తుఫాన్ కు ‘సిత్రాంగ్’ అని పిలుస్తారని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలపై కూడా అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ‘సిత్రాంగ్’ అనే పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో ‘సిత్రాంగ్’ అంటే ‘వదలనిది’ అని అర్థం. అయితే ఈ సిత్రాంగ్ తుపానుపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని మెస్సేజ్ కూడా అందింది.
previous post