ఇతర దేశాల విమానాలు ఆగడానికి, ఇంధనం నింపుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) అంగీకరించడంతో ఈ నెల 8 నుంచి వివిధ దేశాలకు విమానాలు నడిపేందుకు ఎమిరేట్స్, ఇతెహాద్ ఎయిర్ వేస్ సంస్థలు సిద్ధమౌతున్నాయి.
ఆసియా దేశాలు, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలలోని 29 గమ్యస్థానాలకు జూన్ 15 నుంచి ట్రాన్సిట్ విమానాలు నడపబోతున్నట్లు దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్ తెలిపింది. అబుదాబీ కి చెందిన ఇతెహాద్ జూన్ 10 నుంచి ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాలలోని 20 నగరాలకు విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించింది.
కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలవడానికి విధించిన నిషేధాన్ని యుఏఈ ఎత్తేయడంతో ఈ అతిపెద్ద విమానయాన సంస్థలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి యుఏఈ అన్ని దేశాల విమానాలను తమ దేశంలో ఆగేందుకు అనమతి నిరాకరించింది.
తాజాగా దేశంలోని కొన్ని షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలపై నిషేధాలు ఎత్తివేసినందున విమాన సర్వీసులకు కూడా అనుమతిఇచ్చింది. అయితే తమ పౌరసత్వం ఉన్నవారు తప్ప వేరే దేశస్థులు తమ దేశానికి రావడం పైన మాత్రం నిషేధం కొనసాగిస్తున్నారు. కతార్ ఎయిర్ వేస్ కూడా తమ సర్వీసులను ప్రారంభించేందుకు నిర్ణయించింది.