ఎన్ని పట్టణ ప్రగతులు చేస్తే కొల్లాపూర్ కు పట్టిన మురికి వదులుతుందో అర్ధం కావడం లేదు. కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు ప్రాంతంలోని జి యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల దగ్గరలో మురికి నీరు వరదలా పారుతున్నది. పందులు దొర్లుతున్నాయి. దుర్గంధం వెదజల్లుతూ మురికి విస్తరించి ఉంది.
ముళ్ళ పొదలు, మురికి కాలువలు, పందుల కోలాహలం. ఇక విద్యార్ధులు ఎలా చదవాలి? ఇదే ప్రశ్నను అక్కడి పాఠశాల ఉపాధ్యాయులు అడుగుతున్నారు. పది రోజుల పట్టణ ప్రగతిలో తమ స్కూలు పక్కన ఉన్న మురుగు కాల్వ బాగుపడుతుందేమో నని అందరూ ఎదురు చూశారు.
అయితే ఆ మురుగు కాల్వను బాగు చేయలేదు. మురుగునీరు, దుర్గంధం కారణంగా 39మంది విద్యార్ధులు అనారోగ్యం పాలయ్యారు. స్కూలు కు రావడం లేదు. ఇదే వార్డు నుంచి ఎంపిక అయిన కౌన్సిలర్ మునిసిపల్ చైర్మన్ అయ్యారు. అదే వార్డులో ఉన్న జి యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ముళ్ళ పొదలు, మురికి కాలువలు,పందుల వలన విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆ పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు.
చివరికి పాఠశాల ఒక గదిని మూసి మూడు రూమ్ లలో క్లాసులు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. మురికి వాసన నుండి విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతినడంతో పాఠశాలకు రావడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, చైర్మన్ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.