కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదని, వేతన జీవులకు మొండిచేయి చూపించారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరో సారి వైసిపి విఫలం అయిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు.
28 మంది వైసిపి ఎంపిలు రాష్ట్రానికి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఎటువంటి మేలు జరగదని ఆయన అన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరం అన్నారు.
పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదని చంద్రబాబు అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని చంద్రబాబు అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసిపి ప్రభుత్వం మరో సారి పూర్తిగా విఫలం అయ్యిందని ఆయన అన్నారు.