లారీల కొరతతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిని మిల్లులకు తరలించేందుకు ఇసుక, లిక్కర్ లారీలను ఉపయోగించాలని టి పి సి సి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు.
రుద్రంగి మండలం మానాల గ్రామంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి పదిహేను కిలోమీటర్లు లోపు ఉన్న రైస్ మిల్లులకు గ్రామాల్లో ఉన్నట్రాక్టర్ల ద్వారా ధాన్యం బస్తాలను తరలించే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు.
రైతులు కల్లాల వద్ద నెల రోజుల నుండి ధాన్యం విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు ఇసుక, లిక్కర్ లారీల నుపయోగించి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
రోహిణి కార్తీ రావడంతో రైతులు రబీ వ్యవసాయానికి సిద్ధమవుతున్న తరుణంలో వారికి విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ వెంటనే అమలు చేసి రైతులకు కొత్త రుణాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం మానాల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తూం జలపతి అనారోగ్యంతో ఉండగా అతని పరామర్శించారు.
అలాగే మానాల గ్రామ మాజీ విడిసి చైర్మన్ జలంధర్ అన్న కూతురు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కు మోహన్, తూం రవీందర్, జక్కు వంశీ, తూం సాయిలు, దిలీప్, చెలుకల తిరుపతి, రెడ్డి, సుమంత్ రాజిరెడ్డి, భూమయ్య తదితరులు పాల్గొన్నారు