యూపీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. జన విశ్వాస్ యాత్ర పేరుతో బీజేపీ హేమాహేమీలను రంగం లోకి దింపింది. తమ ఫోన్లను సీఎం యోగి ట్యాపింగ్ చేస్తున్నారని తీవ్ర విమర్శలను చేశారు అఖిలేశ్. ఎన్నికల ప్రచారంలో అతిరథమహారధులు రంగం లోకి దిగారు. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి.
బీజేపీ జనవిశ్వాస్యాత్ర పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది . రాష్ట్రంలోని ఆరుప్రాంతాల నుంచి జనవిశ్వాసయాత్ర ప్రారంభమైంది. పలువురు కేంద్రమంత్రులు , బీజేపీ అగ్రనేతలు ఈ యాత్రకు హాజరయ్యారు. మథురలో ఈ సందర్భంగా రోడ్షో నిర్వహించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా జన విశ్వాస్యాత్రకు హాజరయ్యారు . అంబేద్కర్నగర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. యోగి పాలనలో యూపీ అభివృద్దిలో దూసుకెళ్తోందన్నారు నడ్డా.
మరోవైపు ముఖ్యమంత్రి యోగిపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీల నేతల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి .. సాయంత్రం వేళ్లల్లో సీఎం యోగి వింటున్నారని విమర్శించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని , ఈడీ , సీబీఐ దాడులు చేసినప్పటికి భయపడేది లేదన్నారు. అయితే అఖిలేశ్ ఆరోపణలను కొట్టి పారేశారు సీఎం యోగి. ఐటీ దాడులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని , ఈ వ్యవహారం తమ పరిధిలో లేదన్నారు. ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేశామని, ఇప్పడు వాళ్ల ఆశీర్వాదం కోసమే జనవిశ్వాస్ యాత్రను చేపట్టిందని తెలిపారు.