వృద్ధాప్యంలో అందివచ్చిన అవకాశాన్ని గట్టిగా వినియోగించుకోవాలని సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి భావిస్తున్నారు.
నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మరణించడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరగాల్సిన ఉప ఎన్నికను ఇందుకు ఆయన వేదికగా వినియోగించుకోవాలని చూస్తున్నారు.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికలలో స్వైర విహారం చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కన్నేసింది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా విజయం సాధిస్తే ఇక తెలంగాణ అసెంబ్లీపై కాషాయం జెండా ఎగరవేయవచ్చునని కమలనాథుల వ్యూహం.
సరిగ్గా దీన్నే ఉపయోగించుకుని రాజకీయ పాచిక విసిరారు జానారెడ్డి. నాగార్జున సాగర్ లో బిజెపి సరైన అభ్యర్ధిని నిలబెడితే గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అందులోనూ జానారెడ్డిగానీ, ఆయన కుమారులలో ఒకరు గానీ అయితే కమలం గెలవడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఈ విషయాన్ని గ్రహించిన కమలనాథులు జానారెడ్డితో మాటా మంతి సాగించడంతో పెద్దాయన తన మనసులోని మాట బయట పెట్టే సరికి కమలనాథులకు షాక్ తగిలింది.
తన కుమారుడు కమలం గుర్తుపై పోటీ చేయాలంటే తనకు గవర్నర్ పోస్టు ఇవ్వాలని జానారెడ్డి కోరారట.
తనను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే తన కుమారుడిని పోటీకి నిలబెట్టి గెలిపించే బాధ్యత తీసుకుంటానని జానారెడ్డి చెప్పడంతో బిజెపి నాయకులకు షాక్ తగిలింది.
అయితే షాక్ తగిలిన విషయాన్ని మనసులోనే దాచుకుని జానారెడ్డి కోరికను ఢిల్లీకి చేరవేశారు. షరతులు పెట్టి పార్టీలోకి వచ్చే వారిని తాము తీసుకోదలచుకోలేదని బిజెపి పెద్దల నుంచి సమాధానం వచ్చింది.
ముందు పార్టీలో చేరమనండి తర్వాత అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని బిజెపి పెద్దలు కబురు చేశారు.
అయితే నల్గొండ ప్రాంతానికే చెందిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులకు ఇదే విధమైన హామీ ఇచ్చిన బిజెపి ఆ తర్వాత మొహం చాటేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్న జానారెడ్డి తాము బిజెపిలో చేరడం లేదని తన కుమారులతో చెప్పించారు.
ఇంకా సమయం ఉంది కాబట్టి బిజెపితో అప్పుడే బేరం తెగినట్లు కాదని జానారెడ్డి భావిస్తున్నా, జానారెడ్డికి హామీ ఇచ్చి మరీ చేర్చుకోవాల్సిన అవసరం లేదని బిజెపి అధిష్టానం కచ్చితమైన నిర్ణయం తీసుకున్నది.