పల్నాడు ప్రాంతంలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఈ మధ్య ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్ను పల్నాడులో ఎంతో ముఖ్యమైన పిడుగురాళ్ల స్టేషన్లో కానీ, నడికుడి స్టేషన్లో కానీ ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు స్టేషన్ల నుండి ప్రయాణీకులు, వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తుంటారని, ఈ రైల్ వల్ల పల్నాడు జిల్లాలో పర్యాటక, వ్యాపార ప్రయాణాలను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుందని మంత్రికి తెలిపారు.
కోవిడ్ సమయంలో కొన్ని రైల్లు నిలుపుదల తీసేసారని, దీని వల్ల పెద్ద ఎత్తున ప్రజలు అసౌకర్యానికి గురవతున్నారని వాటిని పునరుద్దరించాలని కోరారు. అవి: రైలు నెం. 12733- నారాయణాద్రి ఎక్స్ప్రెస్, రైలు నెం. 17255 – లింగంపల్లి ఎక్స్ప్రెస్, రైలు నెం. 12603 – హైదరాబాద్ SF ఎక్స్ప్రెస్, రైలు నెం. 17626 – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెం. 17015 విశాఖ ఎక్స్ప్రెస్ ఈ రైళ్లును గతం లాగా పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లో ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం సికింద్రాబాద్ మరియు గుంటూరు మధ్య రెండవ ట్రాక్ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా