ఆజాది కా అమృత మహోత్సవాలలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని మెగామైండ్స్ ప్రచురణలు ప్రచురించిన అండమాన్ లో ఆజన్మాంతం వీరసావర్కర్ జైలు గాథ పుస్తకావిష్కరణ జరిగింది. హైదరాబాద్ కె పి హెచ్ బి కాలనీ రోడ్ నెం:1 లోని హర్ష ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకాన్ని తాడేపల్లి హనుమత్ ప్రసాద్ పరిచయం చేశారు. అలాగే కార్యక్రమం లో అనువాద రచయిత ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి సావర్కర్ జీవిత విశేషాలు తెలియజేస్తూ సావర్కర్ ఎన్నో కష్టాలకోర్చి దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేశారని తెలిపారు. ఆయన తన సర్వస్వాన్నీ భారతమాతకు అర్పించారని, నేటి యువత సావర్కర్ మార్గంలో నడవాలని దేశ అభివృద్ధి కై పాటుపడాలని తెలిపారు.
సామాజిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భాస్కరయోగి మాట్లాడుతూ మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని సుభాష్ చంద్రబోస్ చెప్పిన వాక్యాన్ని గుర్తుచేస్తూ ఐ.సి.యస్ చదివి ఉద్యోగం చేయకుండా దేశం కోసం సర్వస్వాన్ని నేతాజీ ధారపోశారని తెలిపారు. మనం ఈరోజు అనుభవిస్తున్న సుఖాలన్నీ ఎందరో మహనుభావుల త్యాగాల వలన వచ్చినవని స్వాతంత్ర్య సమరయోధులందరిని మనం గౌరవించుకోవాలని గుర్తుచేశారు. కార్యక్రమం లో హర్ష ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్ హర్ష, మెగామైండ్స్ రాజశేఖర్, విద్యార్థులు పలువురు కాలని పెద్దలు పాల్గొన్నారు.