హీరో ప్రభాస్ నటించిన కొత్త చిత్రం “ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అయోధ్య రామ మందిర నిర్మాణం దగ్గర చేయాలనేది కృష్ణంరాజు కోరికగా ఉండేది” అని వారి సతీమణి శ్యామలా దేవి అన్నారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే దివికేగారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ విజయదశమి సందర్భంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకకు కృష్ణంరాజు గారితోపాటు ప్రభాస్ ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారని ఆమె గుర్తు చేశారు. ఇతరులను నొప్పించకుండా నిరంతరం పెదాల పై చిరు నవ్వులు చిందించే వారని చెబుతూ వారి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. “మన మనసులో ఎంత బాధ ఉన్నా అది బయటకు వ్యక్తం చేయరాదని.. చిరునవ్వు చిందిస్తే బాధ పారిపోతుంది”అని చెబుతూ నిరంతరం చిద్విలాసంగా ఉండేవారని కృష్ణం రాజు మాటలను తలుచుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. హిందుత్వంపై వారికి ఉన్న మమకారాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వహిందూ పరిషత్ (విహెచ్పీ) రాష్ట్ర నాయకులు వారి నివాసానికి వెళ్లి కృష్ణం రాజు భార్య,పిల్లలను పరామర్శించారు. భారతీయ జనతా పార్టీ.. హిందుత్వానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
2019లో పార్లమెంటు భవనంలో కలిసిన కృష్ణంరాజు చాలా కలివిడిగా మాట్లాడుతూ.. క్యాంటీన్ దగ్గర టీ తాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సినీ హీరో అటల్ బిహారీ వాజ్ పెయ్ హయాంలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారని శ్యామలాదేవి గర్వంగా చెప్పారు. వారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కాకినాడ, నర్సాపూర్ తో పాటు ఉభయగోదావరి జిల్లాలకు ఎనలేని సేవ చేశారని.. పల్లె పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పించారని ఆమె వివరించారు.
ఈనెల 26వ తేదీన తమ స్వగ్రామం మొగల్తూరులో సంస్మరణ సభ నిర్వహిస్తామన్నారు. లక్షలాదిగా తరలివచ్చే అభిమానులు..బిజెపి కార్యకర్తల కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పెంపుడు కుక్క (జింజర్) కృష్ణంరాజుతో అత్యంత సన్నిహితంగా ఉండేదని.. దాన్ని ఏడేళ్ళ క్రితం తమ కూతురు పుట్టిన రోజు సందర్బంగా ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు శ్యామలాదేవి బాధపడుతూ చెప్పారు. తాను ఏడిస్తే “జింజర్” ఓదార్చడానికి ప్రయత్నం చేస్తోందని ఆమె కలత చెందుతూ వివరించారు.
ఈ సందర్భంగా కృష్ణం రాజు గారి కూతుళ్లకు, శ్రీమతికి విశ్వహిందూ పరిషత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని కోరారు. కృష్ణం రాజు ఆశయాలు సాధించేందుకు పనిచేయాలని సూచించారు. విహెచ్పీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరి నాథ్, రాష్ట ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ శివ రాములు, సిరివెన్నెల సాయిలు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు.
సత్యం న్యూస్, అంబర్పేట్