విజయనగరం జిల్లాలో దిశా (ఎఓఎస్)కు అనూహ్య స్పందన లభిస్తుందని జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ తెలిపారు. మహిళల రక్షణకు ప్రతీ మహిళ స్మార్ట్ ఫోనులో దిశా యాప్ ఉన్నట్లయితే.. మీ రక్షణకు మరో మనిషి తోడుగా మీతో ఉన్నట్లేనని.. జిల్లా ఎస్పీ అన్నారు.
దిశా (ఎ ఓఎస్) యాప్ పట్ల మహిళలకు, విద్యార్ధినులకు అవగాహన కల్పించేందుకు.. విద్యార్ధినులు, మహిళలతో మమేకమవుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి 3.20 లక్షల మంది స్మార్ట్ ఫోనుల్లో దిశా (ఎఓఎస్) యాప్ డౌన్ లోడు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
జిల్లా లో దిశా (ఎఓఎస్) పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. దిశా యాప్ ఎలా పని చేస్తుందోనని పరిశీలించేందుకుగాను గత 25రోజుల వ్యవధిలో 1456 టెస్ట్ కాల్స్ వచ్చాయన్నారు. ప్రతీ ఫోను కాల్ ను దిశా (ఎస్ ఓఎస్) సిబ్బంది స్వీకరించి, వివరాలు తెలుసుకొని, సంఘటనా స్థలంకు దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించి, చర్యలు చేపడుతున్నారన్నారు.
ఆపదలో ఉన్న మహిళలు ఎవ్వరైనా యాప్ లోని (ఎస్ఓఎస్) బటన్ ప్రెస్ చేసినపుడు నేరుగా దిశా కంట్రోల్ రూంకు ఆపదలో ఉన్న మహిళల లొకేషనుతో సహా, 10 సెకన్లు వీడియో చేరుతుందన్నారు. వెంటనే, దిశా (ఎస్ఓఎస్) సిబ్బంది అప్రమత్తమై, ప్రమాదంలో వారున్న స్థలంకు దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించడంతో, కొద్ది నిమషాల వ్యవధిలోనే పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని, వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు.
ఈ తరహాలో మన జిల్లాకు సంబంధించి దిశా ఎఓఎస్ నుండి 30 కాల్స్ ను గత 25రోజుల వ్యవధిలో ఫిర్యాదులుగా స్వీకరించి, పరిష్కరించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. దిశా ఎస్ఓఎస్ కు వచ్చిన కాల్స్ లో చాలా వరకు భర్తలు వేధిస్తున్నారని, మద్యం సేవించి న్యూసెన్సు చేస్తున్నారని, ఇతరులు వేధింపులకు పాల్పడుతున్నారని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయన్నారు.
కాల్స్ స్వీకరించిన వెంటనే.. సంఘటనా స్థలంకు దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో.. క్షణాల్లో సంఘటనా స్థలాలకు చేరుకొని, చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ దీపికా తెలిపారు. దిశా (ఎఓఎస్)కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ముఖ్యమైనవి.. ఓ మైనరు బాలిక వివాహం అయిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా దిశా (ఎస్ఓఎస్)కు జూలై 14న ఫిర్యాదు రావడంతో, సమాచారం అందుకున్న దిశా మహిళా పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషనుకు పిలిచి, కౌన్సిలింగు నిర్వహించడంతో.. సమస్య సద్దుమణిగింది. వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరిగింది.
ఓ బాధితురాలు జూలై 17న దిశా (ఎఓఎస్)కు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త మద్యం సేవించి.. తనను, తన పిల్లలను కొడుతున్నట్లు, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తెలపగా.. దిశా మహిళా పోలీసులు ఇరువురిని పిలిచి కౌన్సిలింగు నిర్వహించినప్పటికీ, అతనిలో మార్పు రాకపోవడంతో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా కేసు నమోదు చేసారు.
అలాగే పాచిపెంట మండలానికి చెందిన ఒక వ్యక్తి దిశా (ఎస్ఓఎస్)కు ఫిర్యాదు చేస్తూ.. తన మైనరు కుమార్తెను ప్రేమ పేరుతో ఒక వ్యక్తి వేధించి, మోసగించారని తెలపడంతో.. స్పందించిన పాచిపెంట పోలీసులు అతనిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసారు.అదే విధంగా విజయనగరంలో ఒక మైనరు బాలికను నగరానికి చెందిన వ్యక్తి అసభ ప్రవర్తించినట్లుగా దిశా ఎస్ఓఎస్ కు ఫిర్యాదు రావడంతో.. 2వ పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి.. సంఘటనా స్థలంకు చేరుకొని బాలికను రక్షించారు.
ఈ సంఘటన పై దిశా మహిళా పోలీసులు అతని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.కావున, మహిళలు, విద్యార్థినులు తమ రక్షణకు స్మార్ట్ ఫోనులో తప్పనిసరిగా దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసి, పోలీసుల సహాయంను పొందాలని సకాలంలో పొందాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు.
పోలీసు స్టేషనుకు వచ్చి, ఫిర్యాదు చేసేందుకు సంకోచించే వారు కూడా, ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసి, పోలీసుల సహాయంతో పొందవచ్చునని జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ తెలిపారు.