జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో విజయనగరం జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచన
విజయనగరం జిల్లాలో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలు, పాఠశాలలు వున్నచోట సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బాలికా వసతిగృహాలు కొనసాగించవలసిన అవసరం వుందా లేదా వాటిని జిల్లాలో అవసరం వున్న మరో చోట ఏర్పాటు చేయవచ్చా అనే అంశాలపై సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, కస్తూరిబా పాఠశాలల పి.ఓ. లు చర్చించుకొని సంయుక్తంగా ప్రతిపాదనలు చేయాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు.
విద్యా సంవత్సరం ప్రారంభించేలోగానే ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లయితే వాటిని జిల్లాస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించిన మీదట ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కస్తూరిబా స్కూళ్లు, కళాశాలలు వున్నచోట బాలికల వసతిగృహాల్లో తక్కువగా బాలికలు చేరుతున్నారని తెలుస్తోందని, అందువల్ల వీటిని జిల్లాలో అవసరం వున్న మరోచోట ఏర్పాటుచేస్తే ఉపయోగం వుంటుందేమో ఆలోచించాల్సి వుందన్నారు.
జిల్లాపరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు జెడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలపై జరిగిన చర్చ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో బి.సి.సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పది బి.సి.బాలికల వసతి గృహాలు, సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని వసతిగృహాలు ప్రస్తుతం వున్నచోటే కొనసాగించాలా లేదా వేరే ప్రదేశానికి మార్చాలా అనే అంశంపై సమగ్రంగా చర్చించి ప్రతిపాదించాలని బి.సి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను, సమగ్రశిక్ష పి.ఓ.ను జెడ్పీ ఛైర్మన్ ఆదేశించారు.
మూసివేసిన హాస్టళ్లను తిరిగి తెరిచే అవకాశం
ఇప్పటికే మూసివేసిన హాస్టళ్లను తిరిగి తెరిచే అవకాశం వుందని బి.సి.సంక్షేమాధికారి కీర్తి తెలియజేశారు. ఆప్రకారం తిరిగి తెరిచే అవకాశాలు కూడా పరిశీలించాలన్నారు.జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, సి.హెచ్.సి.ల్లో సిబ్బంది నియామకాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని వాటిపై వాస్తవ పరిస్థితులను వివరిస్తూ నివేదిక సమర్పించాలని జెడ్పీ ఛైర్మన్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారిని ఆదేశించారు.
చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యులు వున్నా, తగిన సౌకర్యాలున్నా ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటూ పంపించి వేస్తున్నారని ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. సి.హెచ్.సి.లు, ఏరియా ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య పెరగాలని, అదేవిధంగా నాణ్యమైన వైద్యసేవలు అందుతాయనే భరోసా రోగులకు కల్పించాలని డి.సి.హెచ్.ఎస్.కు చెప్పారు.
ఆయా ఆసుపత్రులను జిల్లాస్థాయి అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టి వాటి నిర్వహణ మెరుగుపరచాలని జెడ్పీ ఛైర్మన్ చెప్పారు.గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో క్రాష్ ప్రోగ్రాం కింద తాగునీటి సరఫరా పథకాల మరమ్మత్తులు, పునరుద్దరణ పనులు త్వరగా పూర్తిచేయాలని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆ శాఖ పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు.
వేసవిలో తాగునీటి సరఫరాకు చేపట్టిన క్రాష్ ప్రోగ్రాంపై జెడ్పీ ఛైర్మన్ సమీక్షించారు. పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో ప్రారంభించామని, కురుపాంలో సోమ లేదా మంగళవారం నుంచి ప్రారంభిస్తామని పార్వతీపురం మన్యం ఇ.ఇ. ప్రభాకరరావు వివరించారు. విజయనగరం జిల్లాలోని 21 మండలాల్లో క్రాష్ ప్రోగ్రాం ప్రారంభించామని ఇ.ఇ. తెలిపారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గానికి విజయనగరం జెడ్పీ నుంచే నిధులు విడుదల చేస్తామని ఛైర్మన్ తెలిపారు. మే 15లోగా క్రాష్ ప్రోగ్రాం పూర్తి చేస్తామన్నారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై కూడా స్థాయి సంఘ సమావేశంలో చర్చించారు. జిల్లాలో 34 నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందని సామాజిక వన విభాగం డి.ఎఫ్.ఓ. వివరించారు.జిల్లాలో మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ కన్వర్జెన్స్ పనులను 195 కోట్ల మేరకు నిర్వహించడం జరిగిందని డ్వామా పి.డి. ఉమా పరమేశ్వరి వివరించారు. ప్రారంభించి పూర్తికాకుండా వున్న కన్వర్జెన్స్ పనులను మళ్లీ ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.
చెరకు రైతులకు చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా?
పూర్తిచేసిన పనులకు నిధులు విడుదల కావలసి వుందన్నారు. పశువుల షెడ్ల నిర్మాణానికి సంబంధించి వున్న సందేహాలపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు సందేహాలు లేవనెత్తగా మార్చి నెలాఖరు వరకు అప్ లోడ్ చేసిన వాటన్నింటికీ చెల్లింపుల కోసం ప్రతిపాదిస్తామని పి.డి. వివరించారు.జిల్లాలో పండిన చెరకును సంకిలి చక్కెర కర్మాగారానికి తరలిస్తున్న నేపథ్యంలో చెరకు రైతులకు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ జెడ్పీ ఛైర్మన్ ఆరా తీశారు.
భీమసింగి, సీతానగరం రెండు చక్కెర కర్మాగారాల పరిధిలో సరఫరా చేసిన చెరకుకు సంకిలి కర్మాగారం వెనువెంటనే చెల్లింపులు చేస్తోందని ఎలాంటి సమస్యలు లేవని సుగర్కేన్ అధికారులు వివరించారు. భీమసింగి పరిధిలోని రైతులకు 5.90 కోట్లు, సీతానగరం పరిధిలో 24.79 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.
90,424 మెట్రిక్ టన్నుల చెరకును సీతానగరం ఫ్యాక్టరీ పరిధి నుంచి సంకిలి చక్కెర కర్మాగారానికి ఈ ఏడాది పంపించడం జరిగిందని అసిస్టెంట్ కేన్ కమిషనర్ లోకేశ్వర్ చెప్పారు. భీమసింగి ప్రాంతం నుంచి 22 వేల టన్నులకు పైగా చెరకు పంపించామన్నారు. ఈ సమావేశంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ, టి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సి.ఇ.ఓ. కె.రామచంద్రరావు జిల్లా అధికారులు పాల్గొన్నారు.