విజయనగరానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ పెట్రోయిం శాఖ సంయుక్త కార్యదర్శి
సమాజంలోని వివిధ వర్గాల వారికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలను అర్హులైన వారికి చేర్చడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్ మాథుర్ అన్నారు. ఈ నెల మూడో వారంలో జిల్లాలో యీ యాత్ర ప్రారంభమై రెండు నెలలపాటు జనవరి 26వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ యాత్ర నిర్వహణకోసం జిల్లా ప్రభరీ అధికారిగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రోహిత్ మాథుర్….కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయిలో యాత్ర నిర్వహణలో భాగస్వాములైన అధికారుల కమిటీతో సమావేశమయ్యారు.
కేంద్ర పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి వాటిని వినియోగించుకునేలా చైతన్య పరచడం, అర్హులై వుండి పథకాలు పొందలేని వారిని గ్రామాల్లో జరిగే యాత్ర సందర్భంగా గుర్తించి వారికి ఆయా పథకాల ప్రయోజనాలు అందేలా చూడటం కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమని చెప్పారు. అర్హులైన వారికి అవసరమైన డాక్యుమెంట్లు లేని పక్షంలో వాటిని సమకూర్చి పథకాలు మంజూరు చేయడంలో అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి యీ యాత్ర నిర్వహణకు పూర్తి సహకారం లభిస్తోందని, అందువల్ల జిల్లా అధికారులంతా యీ యాత్ర స్ఫూర్తిని అర్ధం చేసుకొని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. పి.ఎం.ఉజ్జ్వల యోజన పథకం కింద జిల్లాలో ఇంకా అర్హులైన వారు మిగిలి వుంటే యీ యాత్రలో భాగంగా వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని హెచ్.పి.సి.ఎల్. అధికారి శ్రీహర్షను ఆదేశించారు. సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున యీ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. జిల్లాలో యీ యాత్రకు చేసిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి యీ కార్యక్రమానికి జిల్లా స్థాయి నోడల్ అధికారి, జెడ్పీ సిఇఓ కె.రాజ్కుమార్ ద్వారా తెలుసుకున్నారు.
జిల్లాలో 17 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి 34 ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఒక కమిటీని నియమించారని, ఈ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సంకల్పయాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా నోడల్ అధికారి రాజ్కుమార్ వివరించారు. మండలస్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో యీ యాత్ర నిర్వహించడం జరుగుతుందని, గ్రామ స్థాయిలోనూ యాత్ర నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. యాత్రలో భాగంగా ప్రచార రథం పర్యటనకు రూప్ మ్యాప్ సిద్ధం చేశామని, ఆయా గ్రామాల్లో పర్యటించే సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించడం, వివిధ పథకాల లబ్దిదారులను సమావేశపరచి వారికి ఆయా పథకాలను ఎలా వినియోగించుకొని ప్రయోజనం పొందవచ్చో తెలియజేయడం, ఆయా కేంద్ర పథకాలు పొందలేని అర్హులైన వారు వుంటే వారికి పథకాలను మంజూరు చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, జిల్లా అదనపు ఎస్పీ అస్మా సమావేశంలో పాల్గొన్నారు.
అంతకుముందు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సంయుక్త కార్యదర్శి… కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తో భేటీ అయ్యారు. జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. యీ యాత్ర నిర్వహణకోసం ఇప్పటికే జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.