పల్లె ప్రగతి పనులు పూర్తి చేయడంలో అధికారులు, ప్రజా పతినిధులు ప్రత్యేక దృషి సారించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ములుగు మండలంలోని దేవగిరిపట్నం, పత్తిపల్లి, పొట్లపూర్, జగ్గన్నపేట గ్రామాల్లో పర్యటించి తనిఖీలు చేశారు.
దేవగిరిపట్నంలో పల్లె ప్రగతి పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పత్తిపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. కూలీలను పెంచి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పొట్లాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేశారు.
కేంద్రం ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సమయానుసారం అందజేయాలన్నారు. జగ్గన్నపేట గ్రామంలో స్వయం సహాయక సంఘ సమావేశంలో పాల్గొని మహిళా పొదుపు సంఘoతో వారు సంఘాల ద్వారా తీసుకున్న అప్పులు ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో తెలుసుకున్నారు.
వాయిదాలు సకాలంలో చెల్లించాలని, ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు ఉన్నారు.