విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను 15 నుంచి 110 డాలర్ల మేరకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. స్టూడెంట్, విజిటర్ వీసాలతోపాటు ఇతర నాన్-పిటిషన్ బేస్డ్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులను ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది.
వీటితోపాటు తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే కొన్ని రకాల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజును 190 నుంచి 205 డాలర్లకు, ప్రత్యేక వృత్తి నిపుణులకు ఇచ్చే వీసా ఫీజును 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచుతున్నట్టు పేర్కొన్నది. కొత్త వీసా ఫీజులు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థులు వీసా కోసం రూ.14 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది.