రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవనోపాధికి దూరమైన ఒక యువకుడిని ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆదుకున్నది. ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్ ఇటీవల గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ కాలు ను పూర్తిగా కోల్పోయాడు.
గత ఐదు నెలలుగా ఇంటి వద్దనే ఉంటూ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాడు. ప్రమాదంలో గాయపడిన సతీష్ కు కృత్రిమ కాలు అమర్చుకునే వీలువుందని వైద్యులు తెలిపారు. అయితే కృత్రిమ కాలు అమర్చుకొనే ఆర్థిక స్థోమత, మానసిక స్థితి కూడా సతీష్ కు లేదు.
ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జర్నలిస్టు కూనూరు మహేందర్ గౌడ్ ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పింగీలి నాగరాజు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న ట్రస్టు నిర్వాహకులు నాగరాజు గురువారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యంతో కలిపి సుమారు నాలుగు వేల రూపాయలు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ సతీష్ కాలి గాయం పూర్తిగా మారిన తర్వాత ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్టు తరఫున కృత్రిమ కాలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కే. మహేందర్ గౌడ్, ఎల్కతుర్తి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.