నిన్న మొన్నటి వరకూ సీఎం జగన్ తో ‘‘రాజగురువు’’గా పూజలు అందుకున్న విశాఖ శారదాపీఠం స్వామీజీ తాజాగా జగన్ ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు చేశారు. ‘‘ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు’’ అంటూ వైసీపీ ప్రభుత్వం పై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు అని స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించడం ఒక్క సారిగా సంచలనం కలిగించింది. పోలీసులను గుంపులు గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. అసలు ఈ రోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర స్వరంతో అన్నారు. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు.
కొండ కింది నుంచి పైవరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని, భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర అన్నారు. ఇంత పెద్ద క్షేత్రానికి ఈవోను నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆయన తెలిపారు.