పల్నాడు జిల్లా నరసరావుపేట లో నూతనంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ పనులను జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ నేడు సమీక్షించారు. పల్నాడు జిల్లా బ్రాంచి బ్లడ్ బ్యాంకు పనులను సమర్ధంగా నిర్వహించిన డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డిని టీం ను జిల్లా కలెక్టర్ శివ శంకర్ అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని మంజూరు చేసినందుకు కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. నరసరావుపేటలో కొత్త బ్లడ్ బ్యాంకు పనుల అభివృద్ధిపై ఇంకా సమకూర్చుకోవాల్సిన నిధుల వనరులు, ఎక్విప్మెంట్, డాక్టర్లు ,సిబ్బంది, తదితర అంశాలపై చైర్మన్ కంజుల వివరించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శివ శంకర్ లోతేటి మాట్లాడుతూ ఇటీవల కొద్ది నెలల క్రితం అంకురార్పణ చేసిన బ్లడ్ బ్యాంకు పనుల అభివృద్ధి స్థాయిని పరిశీలించడం జరిగిందన్నారు. నరసరావుపేటలో ఈ బ్లడ్ బ్యాంకు 400 యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది అని అన్నారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. సెంట్రల్ రెడ్ క్రాస్ నుంచి నాలుగు కోట్లు విలువైన పరికరాలు, దాతల నుండి 20 లక్షలు పైగా సహకారo అందిందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి లను ఎంపీ లాడ్స్ నుండి నిధులు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ వంతు సహాయంగా డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి 1,50,000 విరాళం ప్రకటించినందుకు అభినందించారు. సేవా భావంతో దాతలు ఇప్పటికీ ముందుకు వస్తున్నారన్నారు. రక్తదానం అవసరం చాలా ముఖ్యమైనది అన్నారు. అవసరం వచ్చిన వారికి దాని విలువ తెలుస్తుందని తెలిపారు. వీలైనంత త్వరలో బ్లడ్ బ్యాంకు బ్రాంచిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.