విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని అక్కడ భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. న్యాయస్థానాలలో కేసులు నడుస్తున్నా ఆయన ఖాతరు చేస్తున్నట్లు కనిపించడం లేదు. న్యూఢిల్లీలో జరుగుతున్న International Diplomatic Alliance Meet లో నేడు ఆయన పాల్గొన్నారు.
మార్చి 3,4 తేదీలలో విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం జరుగుతుందని, అప్పటికి తాను కూడా విశాఖ పట్నం కు షిఫ్ట్ అవుతానని ఆయన తెలిపారు. రాజధాని విశాఖపట్నంకు అందరిని ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ను 10 ఏళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు.
ఈ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ను తెలంగాణకు అప్పగించాలని నిర్ణయించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2024కి ముందే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రకటించాల్సి వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ తదుపరి రాజధానిగా ప్రకటించింది. అయితే జగన్మోహన్ ప్రభుత్వం ఇప్పుడు విశాఖను రాజధానిగా చేస్తామని ప్రకటించింది.