తమ ప్రభుత్వం పేదలకు ఇళ్లుకాదు ఏకంగా ఊళ్లే నిర్మించి ఇస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం నగరి మున్సిపల్ పరిధిలోని వారికి నాగరాజకుప్పం మార్గంలో నిర్మించి ఇస్తున్న జగనన్న కాలనీని ఆమె పరిశీలించారు. నిర్మాణాల పురోగతిని, పూర్తి అవడానికి పట్టే సమయం తదితర అంశాలను అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు ఒక అన్న లాగా, తండ్రి లాగా జగనన్న ఆస్థిని అందజేస్తున్నారన్నారు.
స్వంత ఇంటిలో నివాసమున్నామన్న గౌరవాన్ని పేదలకు ఆయన ఇస్తున్నారన్నారు. 1297 ఇళ్లు నాగరాజకుప్పంలోనే నిర్మిస్తున్నారన్నారు. సత్రవాడ, కాకవేడు, పుత్తూరు, వడమాలపేట అంటూ 7995 ఇళ్లు ఒక్క నగరి నియోజకవర్గంలో ఉన్న పేద అక్కాచెళ్లెమ్మలకు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఎందరికో లబ్దిచేకూరుతోందన్నారు. ఇది జనన్నకు వచ్చిన గొప్ప ఆలోచనన్నారు.
గతంలో రేషన్ కార్డులు మంజూరు చేయడానికి కూడా వెనకాడిన ప్రభుత్వాలు నాయకులు నేడు సెల్ఫీ ఛాలెంజ్లు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. సెల్ఫీలు కాదు సేవలు ముఖ్యం అని వారు తెలుసుకోవానల్నారు. నేడు ప్రభుత్వం చేపడుతున్నా అభివృద్ధి పనులైన పాఠశాలలు, ఆస్పత్రులు నవీకరించడం, కొత్త మెడికల్ కాలేజీలు తెప్పించడం లాంటివి చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి పనులన్నారు. పేదవారికి మంచి చేయాలన్న తపన ఉండటంతోనే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు పుట్టుకొచ్చాయన్నారు. పేదవారికి ముఖ్యమంత్రి చేస్తున్న మంచికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ప్రస్తుత పాలనలో తానూ మంత్రి ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ శంకరప్ప, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.