వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉంటున్నారు.. గత ఎన్నికలకు ముందు, ఇటీవల మంత్రిగా కొనసాగినప్పుడు ప్రత్యర్ధి పార్టీలపై ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ విరుచుకుపడ్డారు. గతంలో జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవంతో అన్ని అంశాలపైనా అవగాహన, రాజకీయ పరిజ్ఞానం ఉన్న కురసాల కన్నబాబు వాక్చాతుర్యానికి, ఆయన వాగ్ధాటికి ప్రత్యర్ధి పార్టీలు హడలి పోతుంటాయి.
ప్రజారాజ్యం నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ వైసీపీ నేత గత కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.. గతంలో ఎంతో యాక్టివ్గా కనిపించిన కన్నబాబు మౌనం వెనక అర్ధం ఏమై ఉంటుందో అని వైసీపీలో చర్చ జరుగుతోంది.
జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత తన మొట్టమొదటి కేబినెట్ టీమ్లో కురసాల కన్నబాబుకి కీలక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పదవి చేపట్టారు. అసెంబ్లీలో టీడీపీపై ఎటాక్ చేయడం, జగన్ నిర్ణయాలను, ఆయన ఆలోచనలను ముందుకు తీసుకుపోవడంలో కురసాల కన్నబాబు మంచి మార్కులు వేయించుకున్నారు. జగన్ మది దోచిన మంత్రుల లిస్టులో కురసాల కూడా ఉన్నారనే ప్రచారం ఉంది.
అనూహ్యంగా మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణలో కురసాల కన్నబాబును తొలగించారు. ఆయన స్థానంలో జిల్లా నుండి మరికొందరికి చోటు కల్పించారు. సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకున్న తీసుకున్న నిర్ణయంగా ప్రకంటించారు వైసీపీ సీనియర్ నేతలు. వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్టీ నేతగా ఇటు టీడీపీ, అటు జనసేనని ఎటాక్ చేయడంలో ముందున్న తనను తప్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారట.
అప్పటినుండే కురసాల కన్నబాబు యాక్టివ్గా ఉండడం తగ్గించారనే వాదన ఉంది.గత ఏడాదిన్నిరగా పరిస్థితి ఎలా ఉన్నా, మరో 9 నెలలలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి టైమ్లో జిల్లాలో పార్టీని దగ్గరుండి నడిపించాల్సిన కన్నబాబు సైలెంట్గా ఉండడం ఏంటని సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
ఇటు ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ – జనసేన బలంగా ఉన్నాయని, జగన్ సర్కార్పై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని భావించిన కురసాల సైలెంట్గా ఉన్నారని చెబుతున్నారు ఆయన ప్రత్యర్ధులు.. అలాంటిదేమీ లేదని, పార్టీ హైకమాండ్ రాజకీయాలకు తాను బలి అయ్యానని భావించిన కన్నబాబు, ప్రస్తుతం అన్ని పరిణామాలను సమీక్షించుకుంటున్నారని ఆయన వర్గం నుండి వినిపిస్తోన్న మాట. కురసాల మౌనాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడుతున్నారు ఆయన సహచరులు. కన్నబాబు పార్టీ మారుతున్నాడనేది అబద్ధం అని, అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు.