అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది…..నిజమా??? అదేమిటి ఇలాంటి ప్రశ్న వేశారు అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందీ అంటే దానికి లాజిక్ ఉంది.
అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి వరకూ అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర ప్రారంభం అయింది. మరి కొద్ది రోజుల్లో గుంటూరు జిల్లా దాటి బయటకు వెళుతుంది. మార్గ మధ్యంలో చాలా జిల్లాలను దాటి మహాపాదయాత్ర శ్రీకాకుళం చేరాల్సి ఉంది. పాదయాత్ర ఆరంభం అవుతుందని తెలిసిన నాటి నుంచి అధికార వైసీపీ నాయకులు అత్యంత దారుణంగా అమరావతి రైతులను అవమానిస్తున్నారు.
ఎంతో అనుభవం ఉన్న మంత్రుల నుంచి కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేల వరకూ పరుష పదజాలంతో అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సీనియర్ మంత్రులు కూడా మాట్లాడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధ్యత మరచి వారు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ ఖండించడం లేదు.
ఇంత జరుగుతున్నా కూడా ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల నోరు మెదపడం లేదు. ఇతర ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా మంత్రుల బాధ్యతారహితమైన వ్యాఖ్యల్ని ఖండించడం లేదు.
ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరావు రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి, అత్యంత సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు, ఏ విషయంపైన అయినా సరే అనర్గళంగా మాట్లాడే తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత, మరో సీనియర్ నాయకుడు కూన రవికుమార్, గంటా శ్రీనివాసరావులు ఉన్నారు.
వీరిలో ఏ ఒక్కరూ కూడా అమరావతి రైతుల మహా పాదయాత్రపై మంత్రులు చేస్తున్న విచక్షణారహిత ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే ఓట్లు పోతాయని భయమా? లేక అమరావతి రాజధాని గా ఉండటం వీరికి ఇష్టం లేదా?
లేక విశాఖ పట్నం రాజధానిగా మారుతుందని ఇంకా వీరంతా ఆశతో ఉన్నారా? తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా వీరితో అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుకూలంగా ఎందుకు మాట్లాడించలేకపోతున్నారు?