తమిళనాడు నుంచి స్పిరిట్ తీసుకువచ్చి విదేశీ మద్యం బ్రాండ్లను తయారు చేసి అమ్ముతున్న ఒక భర్యాభర్తను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. త్రిసూర్లోని వల్లంచిర పాలపెట్టి కాలనీలోని వలియాంకల్ ఇంట్లో డెనిష్ జాయ్ (32), అతని భార్య అశ్వతి (30) అద్దెకు ఉంటున్నారు. డెనిష్ జాయ్ ఏడాదిగా ఇక్కడ అద్దెకు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.
తమిళనాడు నుంచి పికప్ వ్యాన్లో స్పిరిట్ను రవాణా చేసి ఈ భార్యభర్త ఇక్కడకు తీసుకువస్తారు. తమిళనాడు నుండి దిగుమతి చేసుకున్న స్పిరిట్ తో వీరు విదేశీ బ్రాండ్ మద్యం తయారు చేస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు స్పిరిట్, మద్యం రవాణా చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తుంటారు. ఒక్కో ప్రాంతం నుంచి డిమాండ్ను బట్టి తమిళనాడు నుంచి తీసుకొచ్చిన ఖాళీ మద్యం బాటిళ్లను కడిగి వారు తయారు చేసిన మద్యం అందులో నింపుతారు.
వివిధ బ్రాండ్ల హోలోగ్రామ్లను కూడా ముద్రించి ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఎంతో కాలంగా వీరిద్దరూ ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. అంగమలిలోని వారి అద్దె ఇంట్లో నుంచి మొత్తం 2345 లీటర్ల స్పిరిట్ మరియు 954 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంగమలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.