నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదం జరిగిoది . ఈ ప్రమాదంలో భార్య మృతిచెందగా భర్త పరిస్థితి విషమంగా మారింది. మర్రిగూడ మండలంలోని ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన సిలివేరు ముత్తయ్య దంపతులు నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు.
ఈ క్రమంలో మర్రిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకుని రోడ్డు ఎక్కుతుండగా మాల్ నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం వారిని బలంగా ఢీ కొట్టింది. దీంతో ముత్తయ్య దంపతులకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి వెళ్లారు. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాదుకు తరలించారు. చికిత్స పొందుతూ ముత్తయ్య భార్య పుల్లమ్మ(58)మృతి చెందింది. ముత్తయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ముత్తయ్య కుమారుడు నరసింహ తెలిపారు. నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రంగారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.