ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామం లో 6 వారాలుగా కరువు పనులు చేస్తున్నా కూలి డబ్బులు ఇవ్వడం లేదని, ఎలా బ్రతకాలని సుమారు 200 మంది కరువు పనులు కూలీలు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉదయం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఇంతవరకు కొత్త పనులకు ప్రతిపాదనలు లేవని చేసే పనులకు వేసే మాస్టర్ లకు పొంతన లేదని ఎన్ ఆర్ ఈ జీ ఎస్ సిబ్బంది పై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో బాధ్యత లేని ఉపాధి హామీ పనుల అధికారులు పనిచేయడం మా ఖర్మ అని కొప్పాక సర్పంచ్ భాస్కర్ దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా గ్రామం లో కరువు పనుల కూలీలు ఎదుర్కొంటున్న దుస్థితి పై మండల, జిల్లా స్థాయి అధికారులకు మొర పెట్టుకున్నా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా అధికారులేవరూ పట్టించు కున్న వారే లేరని అన్నారు.
గ్రామ పంచాయతీ లో కరువు పనులు జరుగుతున్న తీరు దిక్కూ దివానం లేని విధం గా ఉందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటె కేవలం లక్ష రూపాయల బిల్లు చేయాలన్నా 5 నుండి 10 వేలు మామూళ్లు తీసుకుని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయని సమాచారం. మరి ఎక్కువ మొత్తాల బిల్లాలకు పర్సెంటేజ్ ఇంకెంత వసూలు చేస్తున్నారో ననే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అంటున్నాయి.