ఆర్థిక సమృద్ధిని సాధించడానికి ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకాన్ని మహిళలు వినియోగించుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్ సురభి (స్థానిక సంస్థలు) అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ ప్రాంగణంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో పీ.ఎం.ఈ. జీ. పీ పథకం పై అవగాహన సదస్సు మంగళవారం డీ ఆర్డీ ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టు డైరక్టర్ పారిజాతం, ఏ పి డి శ్రీనివాస్, పెన్షన్స్ డి పి ఎం పద్మ ప్రియ,జిల్లా పరిశ్రమల శాఖ జి. ఎం డి.శ్రీనివాస్ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు మెరుగైన జీవనోపాదుల పై దృష్టి సారించాలని, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు మహిళలు ముందుకు వచ్చి ఆర్థిక పరిపుష్టి పొందాలని పేర్కొన్నారు.
యువత ఉపాధి మార్గాల వైపు మక్కువ పెంచుకొని వలసలు, ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రంగా రూపొంది దేశానికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. వితంతు ఒంటరి మహిళలు నూతన వికాసం దిశగా ఆలోచించి స్వయం ఉపాధులను మెరుగుపరుచుకుని కుటుంబ సంక్షేమాన్ని వైపు అడుగులు వేయాలని సూచించారు.
ఎంపిక చేసుకున్న జీవనోపాధి పై ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి తగిన శిక్షణ లను ఇప్పించి నైపుణ్యం పొందే విధంగా జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, ఎంపిక చేసుకున్న జీవనోపాధులు మెరుగుపడటం కోసం అండగా నిలుస్తామని అన్నారు.
ఈ పథకంలో బ్యాంకు సేవలు అందించడానికి బ్యాంకు అధికారులు సిద్ధంగా ఉన్నారని జీవనోపాధి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి సంబంధిత శాఖ అధికారులు సలహాలు సూచనలు ఇవ్వడానికి కృషి చేస్తారని అన్నారు. జీవనోపాధి లేదని మానసికంగా కుంగిపోకుండా పీ.ఎం.ఈ. జీ.పీ సేవలను పొంది సాధారణ మహిళల కంటే దీటుగా ముందుకు సాగాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఖాదీ కమిషన్ హైదరాబాద్ అడ్వైజర్ సిహెచ్. రాజేష్ కుమార్, ఖా దీ మండలి వరంగల్ రీజినల్ మేనేజర్ సిహెచ్. అశోక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సంతోష్, ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, శ్రీనిధి ఆర్ ఎం అరుణ్ సింగ్, ఆర్.ఎస్.ఈ.టీ. ఐ. ఫ్యాకల్టీ ఎం డి బషీర్, డిపిఎం గోవింద్ చౌహాన్ లు పాల్గొన్నారు
కునూరు మహేందర్, సత్యం న్యూస్, ములుగు