మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని సీఐ ఈ చంద్రమౌళి పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లోని ఎక్స్ రోడ్ వద్ద అవగాహన కార్యక్రమం చేపట్టారు. మహిళల భద్రతకు సంబంధించిన గోడ పత్రాలను ప్రజలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పి ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, మంత్రాలు, నిర్బంధ కార్మికులు, బానిసత్వం, లైంగిక వేధింపులు, మిస్సింగ్ కేసులకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై జరిగే నేరాలపై జిల్లా పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
బాల్య వివాహాల నిరోధానికి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గృహ హింస అనేది సామాజిక సమస్య అని, నిర్భయంగా మహిళలు ఫిర్యాదు చేసినప్పుడే లైంగిక వేధింపులు తగ్గుముఖం పడతాయన్నారు.
ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల నిందితులకు కఠినమైన శిక్షలు పడ్డాయని వివరించారు. భౌతిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో జోడించిన సాక్ష్యంతో నిందితులకు కఠినమైన శిక్షలు సాధ్యమైందని తెలిపారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలకు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు, ఒకవేళ డబ్బులు పోయినా వెంటనే 155260 లేదా డయల్-100 కు ఫోన్ చేసి పూర్తి వివరాలతో సమాచారం అందించాలన్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ ముత్యాల రమేష్ కుమార్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్ సింగ్, కాతిలే హనుమంతరావు, గ్రామ సర్పంచ్ జాదవ్ హరినాయక్, తదితరులు పాల్గొన్నారు.