మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, సింగిరెడ్డిపాలెం మండల పరిషత్ కేంద్ర ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనుల పరిశీలించారు.
జెడ్పి ఉన్నత పాఠశాలలో రూ. 72 లక్షల అంచనాలతో క్రొత్త టాయిలెట్ బ్లాక్, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, పాత టాయిలెట్ బ్లాక్ రెనోవేషన్, త్రాగునీటి సౌకర్యం, డైనింగ్ హాల్ రెనోవేషన్, రూఫ్, చిన్న, పెద్ద మరమ్మత్తులు చేపట్టినట్లు, పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. రూ. 6.60 లక్షలతో ప్రాథమిక పాఠశాలలో కాంపౌండ్ వాల్, పెద్ద, చిన్న మరమ్మత్తులు, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షణ
చేయాలన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చి, విద్యా ప్రమాణాల పెంపుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ పర్యటన సందర్భంగా జెడ్పి వైస్ చైర్ పర్సన్ ఎం. ధనలక్ష్మి, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, డిఇ చంద్రశేఖర్, నేలకొండపల్లి ఎంపిపి వి. రమ, ఎంపిడివో జమలా రెడ్డి, తహసీల్దార్ డి. ప్రసాద్, సర్పంచ్ ఆర్. నవీన్, ఎంపిటిసి బొందయ్య, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు ఉన్నారు.