కరోనా కష్ట కాలంలో ఒక సంవత్సరం పాటు పన్ను మినహాయింపు ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా పన్నులు పెంచుతోదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
కరోనా విజృంభణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్, కర్ఫ్యూ ల కారణంగా గత సంవత్సర కాలంగా అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారని ఆయన తెలిపారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలకి పన్నుల మోత మోగిస్తూ “రిటర్న్ గిఫ్ట్” ఇవ్వడం శోచనీయమని ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు ఐఏఎస్ అధికారుల పాలనలో కొనసాగడంతో క్యాపిటల్ (CV) వాల్యూ పద్ధతిలో పన్నులు పెంచుతూ ఏకపక్షంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారని ఆయన తెలిపారు.
భూమి విలువ ఆధారిత పన్ను విధానానికి స్వస్తి పలికి గతంలో ఏదైతే అమలులో ఉన్నదో ARV (annual rental value) సంవత్సర ఆదాయ ఆధారిత పన్ను విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా బారిన పడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడ్డ ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో “మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు” ప్రభుత్వం పన్నులు పెంచడం ధర్మమా అని ఆయన ప్రశ్నించారు.