రాజకీయాలకు అతీతంగా వై ఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు చెప్పిన వై ఎస్ విజయలక్ష్మి ఆకాంక్ష తీరేలా కనిపించడం లేదు. వై ఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభకు 300 మంది ప్రముఖులను ఆహ్వానించినా ఎక్కువ మంది రాలేదు. సభ అధికారికంగా 5.30కి ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే నాయకులు తరలి రాకపోవడంతో రాత్రి ఏడు గంటలకు కూడా ప్రారంభం కాలేదు. వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ అయిన డాక్టర్ కె వి పి రామచంద్రరావు, ఆయనతో బాగా సఖ్యతగా ఉండే ఉండవెల్లి అరుణ్ కుమార్ మాత్రమే ఇప్పటి వరకూ హాజరైన పెద్దలు. వీరితో బాటు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి మరి కొందరు మాత్రమే హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది సేపటిలో రానున్నారని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ లో ఉన్న వారు ఎవరూ హాజరు కాలేదు.
అదే విధంగా బిజెపిలో చేరిన ఆ నాటి కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు రాలేదు. తెలుగుదేశంలో చేరిన వారు, ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారు కూడా రాలేదు.
దాంతో సభ బోసిపోయినట్లుగా కనిపిస్తున్నది. ఈ సభను విజయవంతం చేసి తెలంగాణలో కుమార్తె వై ఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానానికి బంగారు బాటలు వేద్దామనుకున్న వై ఎస్ విజయలక్ష్మి ఆశలు సాయంత్రం 7 గంటల వరకూ చూస్తే తీరేలా కనిపించడం లేదు. ఇప్పుడు పిలిచిన అతిధులందరూ వస్తే చెప్పలేం.