వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న మున్నూరు కాపు ల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు బిచ్కుంద మండల కోఆర్డినేటర్ నాల్చర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ పి ఆనంద్ కుమార్ కు ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కన్వీనర్ పుట్ట పురుషోత్తంరావు పటేల్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈరోజు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రకృతి వైఫరీత్యాలతో ఆరుగాలం కష్టపడిన పంటలు సరిగా పండక చీడపీడల బారినపడి రైతుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాపులు వ్యవసాయం వదులుకోలేక ఇతర వృత్తులవైపు మళ్లడానికి ఆర్థిక స్థోమత లేక బాధలతో పిల్లల చదువులకు కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. కావున ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి పిల్లలకు స్కిల్ ట్రెయినింగ్ ఇప్పించాలని ఆయన కోరారు. మున్నూరు కాపులు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అప్పులు ఇచ్చే విధంగా తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మున్నూరు కాపుల కష్టాలను గుర్తించి ఒక వెయ్యి కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి తమ భావితరాలను ఆదుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మున్నర్ కాపు సోదరులు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, చింతల హనుమాన్లు, హజి లక్ష్మణ్, బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీలు మొగులయ్య, గంగారాం, రామాలయ కమిటీ చైర్మన్ హాజీ బాల్రాజ్ ,అరవింద్, మున్నూరు నాగనాథ్, సాయిని అశోక్ ,పొతుల గంగారాం తదితరులు పాల్గొన్నారు.